హైదరాబాద్‌లో తీవ్ర నీటి ఎద్దడి.. 17 వేలకు పైగా ట్యాంకర్ బుకింగ్స్ పెండింగ్!

BC7News
By
3 Min Read

హైదరాబాద్ మహానగరంలో నీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో నగరంలో నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ట్యాంకర్ నీటికి డిమాండ్ భారీగా పెరిగింది. గురువారం నాటికి హైదరాబాద్ జలమండలిలో ఏకంగా 17,658 ట్యాంకర్ బుకింగ్స్ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

మే నెలలో ట్యాంకర్ బుకింగ్స్ 22 వేలు దాటగా.. జూలైలో డిమాండ్ తగ్గాల్సి ఉన్నప్పటికీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఏప్రిల్, మే నెలల్లో ఉన్న నీటి కొరత పరిస్థితులే ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

నగరం మొత్తం విస్తరించిన ట్యాంకర్ డిమాండ్

గతంలో ట్యాంకర్ల కోసం ప్రధానంగా అపార్ట్‌మెంట్ వాసులే ఎక్కువగా బుకింగ్ చేసుకునేవారు. ముఖ్యంగా సైబరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు అయ్యప్ప సొసైటీ, కూకట్‌పల్లి, ఎస్‌ఆర్‌నగర్, జూబ్లీహిల్స్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్యాంకర్లకు భారీ డిమాండ్ ఉండేది.

అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. నీటి ఎద్దడి నగరంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించడంతో కాలనీలు, బస్తీల ప్రజలు కూడా ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. శివారు ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.

ముషీరాబాద్, రాంనగర్, చిక్కడపల్లి, ఉప్పల్, బోడుప్పల్, ఎల్బీనగర్, ఎన్‌టీఆర్‌నగర్, మల్కాజిగిరి ప్రాంతాల్లో గత నెల నుంచి ట్యాంకర్లకు డిమాండ్ భారీగా పెరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు జలమండలిని కోరుతున్నారు.

5 మీటర్ల దిగువకు పడిపోయిన భూగర్భ జలాలు

వర్షాలు లేకపోవడంతో నగర శివారు ప్రాంతాల్లో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. గతేడాది జూన్‌తో పోలిస్తే రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో భూగర్భ జలమట్టం దాదాపు 5 మీటర్ల మేర పడిపోయినట్లు సమాచారం.

ఆమన్‌గల్, సరూర్‌నగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లో సుమారు 1.5 మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గాయి. గండిపేట, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఒక మీటర్ వరకు పడిపోయాయి.

మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్, బాలానగర్ మండలాల్లో సుమారు 2.5 మీటర్ల మేర నీటిమట్టం దిగజారింది. మేడిపల్లి, ఉప్పల్, అల్వాల్ ప్రాంతాల్లో దాదాపు ఒక మీటర్ వరకు తగ్గింది.

హైదరాబాద్ జిల్లాలోని తిరుమలగిరి, సైదాబాద్ ప్రాంతాల్లో సుమారు 2 మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గినట్లు తెలుస్తోంది. బండ్లగూడ, అంబర్‌పేట ప్రాంతాల్లో కూడా భూగర్భ జలమట్టం గణనీయంగా పడిపోయింది. దీంతో పలు ప్రాంతాల్లో ఇళ్లలోని బోర్లు ఎండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వట్టిపోతున్న జలాశయాలు.. పెరుగుతున్న ఆందోళన

హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, సింగూరు, మంజీర, అక్కంపల్లి, నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీపాద ఎల్లంపల్లి వంటి వనరుల నుంచి నగరానికి నీటి సరఫరా జరుగుతోంది.

వర్షాలు లేకపోవడంతో ఆయా రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో అత్యవసర పంపింగ్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.

ఇప్పటికే సింగూరు జలాశయంలో ఎమర్జెన్సీ పంపింగ్ కోసం అధికారులు ట్రయల్ రన్ నిర్వహించినట్లు సమాచారం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలో అత్యవసర పంపింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.

ఆగస్టు నాటికి కూడా తగిన వర్షాలు కురవకపోతే ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అవసరమైతే మిషన్ భగీరథకు కేటాయించిన నీటిని కూడా హైదరాబాద్ జలమండలికి మళ్లించే పరిస్థితి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

‘వారానికి ఒక్కసారైనా నీళ్లు రావట్లేదు’

నీటి సరఫరా సమస్యలపై పిట్టలబస్తీకి చెందిన ఓ స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశారు.

“మా ప్రాంతానికి జలమండలి నుంచి సరఫరా అయ్యే మంచినీళ్లు వారానికి ఒక్కసారి కూడా రావడం లేదు. జలమండలి ట్యాంకర్ బుక్ చేసి వారం దాటినా ఇంటికి రావడం లేదు. దీంతో డబ్బులు పెట్టి ప్రైవేట్ ట్యాంకర్లు తెప్పించుకుంటున్నాం. బట్టలు ఉతకడానికి, ఇతర అవసరాలకు చింతల చెరువు నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. తాగునీటి సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియడం లేదు. ఎన్నికల సమయంలో నాయకులు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. ఇప్పుడు మా సమస్యలను పట్టించుకునేవారు ఎవరూ లేరు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మొత్తంగా హైదరాబాద్‌లో పెరుగుతున్న నీటి కొరత.. ట్యాంకర్లకు పెరుగుతున్న డిమాండ్.. పడిపోతున్న భూగర్భ జలాలు.. తగ్గుతున్న రిజర్వాయర్ నీటి నిల్వలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. రానున్న రోజుల్లో వర్షాలు కురవకపోతే నగరంలో నీటి సమస్య మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article