ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఒకే రోజు అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ సమావేశం, బ్రిక్స్ యువజన, క్రీడల మంత్రుల సమావేశంలోనూ సీఎం పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పర్యటనలో భాగంగా శనివారం ఉదయం అమరావతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరే చంద్రబాబు తొలుత అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం అలమండ గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం ఉదయం 11.05 గంటలకు ఏ.కొడూరు జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన ‘ప్రజా వేదిక’కు హాజరవుతారు. మధ్యాహ్నం 1.15 గంటల వరకు అక్కడే ఉండి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు.

అనకాపల్లి పర్యటన ముగించుకుని చంద్రబాబు విజయనగరం జిల్లా ఎస్.కోటకు వెళ్తారు. సాయంత్రం 4.20 గంటలకు స్థానిక ఎమ్మెల్యే కె. లలితకుమారి నివాసానికి వెళ్లి ఆమెను కలుస్తారు.
ఆ తర్వాత విశాఖపట్నం చేరుకునే సీఎం.. సాయంత్రం 5.05 గంటలకు నోవాటెల్ హోటల్లో జరిగే రెండో బ్రిక్స్ యువజన, క్రీడల మంత్రుల సమావేశం–2026లో పాల్గొంటారు.
విశాఖ కార్యక్రమాలు ముగిసిన అనంతరం చంద్రబాబు రాత్రికి అమరావతికి తిరిగి చేరుకుంటారు. ఒకే రోజు ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, అంతర్జాతీయ స్థాయి సమావేశాల్లో పాల్గొంటూ సీఎం ఉత్తరాంధ్ర పర్యటన సాగనుంది.