పండుగ సీజన్ సమీపిస్తున్న వేళ దేశంలో చక్కెర ధరలు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ధరలను నియంత్రించడంతో పాటు మార్కెట్లో తగినంత చక్కెర లభించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. జూలై 20న కిలో చక్కెర ధర రూ.48.18గా ఉండగా, ఆగస్టు 20 నాటికి రూ.55.70కి పెరిగింది. ధరల పెరుగుదలకు పండుగ సీజన్కు ముందు డిమాండ్ పెరగడంతో పాటు దేశీయ ఉత్పత్తి తగ్గడం వంటి కారణాలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ధరల నియంత్రణలో భాగంగా పండుగ సీజన్ కోసం 10 లక్షల టన్నుల చక్కెర దిగుమతికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అదే సమయంలో వ్యాపారులు అధికంగా నిల్వ చేయకుండా 400 టన్నుల స్టాక్ పరిమితిని విధించింది.

చక్కెర ధరల పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తిని కారణంగా చూపడం సరికాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇథనాల్ తయారీకి మళ్లిస్తున్న చక్కెర వాటా 2022-23లో 12 శాతం నుంచి 2025-26 నాటికి సుమారు 9 శాతానికి తగ్గుతుందని తెలిపింది. దేశీయ ఇథనాల్ ఉత్పత్తిలో దాదాపు మూడొంతులు ఇప్పటికే ధాన్యాల నుంచి వస్తోందని పేర్కొంది.
చెరకు ఉత్పత్తిపై వాతావరణ ప్రభావం, ఊహించిన దానికంటే తక్కువ చక్కెర ఉత్పత్తి, పండుగల ముందు పెరిగిన వినియోగ డిమాండ్, అంతర్జాతీయంగా సరఫరా కొరత, మార్కెట్లో ఊహాగానాలు, అధిక నిల్వలు వంటి అంశాలు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని కేంద్రం తెలిపింది.
కృత్రిమ కొరత సృష్టించడం, అనవసరంగా ధరలు పెంచడం, అక్రమ నిల్వలకు పాల్పడటాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం మార్కెట్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.