TG Veer Portal: పోలీసు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాల సంక్షేమంపై తెలంగాణ పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. వారి సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు డీజీపీ సీవీ ఆనంద్ ‘టీజీ-వీర్’ పేరుతో ప్రత్యేక గ్రీవెన్స్ పోర్టల్ను ప్రారంభించారు.
అమరవీరుల కుటుంబాలకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, కారుణ్య నియామకాలు, నివేశన స్థలాలు, పెన్షన్, ఎక్స్గ్రేషియా వంటి అంశాల్లో ఏమైనా సమస్యలు ఉంటే ఈ పోర్టల్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం

ఉంటుంది.
QR కోడ్తో పోర్టల్ యాక్సెస్
అమరవీరుల కుటుంబాలకు క్యూఆర్ కోడ్ ఆధారిత ఫ్యామిలీ కార్డులను అందిస్తున్నారు. కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ‘టీజీ-వీర్’ పోర్టల్ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
దీంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తమ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కుటుంబాలకు లభిస్తుంది.
అన్ని వివరాలు ఒకే ప్లాట్ఫామ్లో
అమరవీరుడి సర్వీసు వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, ఇప్పటివరకు అందిన ప్రభుత్వ ప్రయోజనాలు, సంబంధిత ఉత్తర్వుల వివరాలను పోర్టల్లో పొందుపరుస్తారు.
ఫిర్యాదు అందిన తర్వాత దాన్ని యూనిట్ స్థాయి, రాష్ట్ర స్థాయిలోని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. సమస్య పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలను కూడా అధికారులు సమీక్షించే విధంగా వ్యవస్థను రూపొందించారు.
28 కుటుంబాలతో డీజీపీ సమావేశం
వరంగల్ పర్యటనలో భాగంగా డీజీపీ సీవీ ఆనంద్ మావోయిస్టుల పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన 28 మంది పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులను కలిశారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తమకు సంబంధించిన పలు సమస్యలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఎక్స్గ్రేషియా, ఆర్థిక సాయం, పెన్షన్ తదితర అంశాలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయని కొందరు కుటుంబ సభ్యులు తెలిపారు.
వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చిస్తానని డీజీపీ హామీ ఇచ్చారు. అమరవీరుల కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్కు సూచించారు.
వరంగల్తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న డీజీపీ
నక్సల్స్ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో తన వృత్తి జీవితాన్ని వరంగల్లోనే ప్రారంభించానని సీవీ ఆనంద్ తెలిపారు.
పోలీసుల త్యాగాల కారణంగానే ఈ ప్రాంతంలో నేడు శాంతి నెలకొందని ఆయన పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలను ప్రభుత్వం, పోలీసు శాఖ ఎప్పటికీ విస్మరించబోదని తెలిపారు.
కొత్త కమిషనరేట్ భవనాన్ని పరిశీలన
వరంగల్ పర్యటనలో భాగంగా నిర్మాణంలో ఉన్న కొత్త పోలీస్ కమిషనరేట్ భవనాన్ని డీజీపీ పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన మౌలిక వసతులు, భవిష్యత్ అవసరాలపై అధికారులతో చర్చించారు.
‘టీజీ-వీర్’ పోర్టల్ ద్వారా అమరవీరుల కుటుంబాల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థ అందుబాటులోకి రావడం పోలీసు శాఖ సంక్షేమ చర్యల్లో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.