భారత యువత ఆర్థిక ఆలోచనలో పెద్ద మార్పు కనిపిస్తోంది. జీతం ఒక్కటే కాదు.. అదనపు ఆదాయం కూడా తప్పనిసరి అనే దిశగా యువత అడుగులు వేస్తోంది.
క్లియర్ట్యాక్స్ తాజా నివేదిక ప్రకారం, 25 ఏళ్లలోపు పన్ను చెల్లింపుదారుల్లో 76 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులను కలిగి ఉన్నారు. నాలుగేళ్ల క్రితం ఈ సంఖ్య కేవలం 14 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.
షేర్లలో పెట్టుబడులు, స్టాక్ ట్రేడింగ్, ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, కన్సల్టింగ్, సొంత వ్యాపారాలు.. ఇలా అనేక మార్గాల ద్వారా యువత అదనపు ఆదాయం సంపాదిస్తోంది. దీంతో సంపద సృష్టిపై అవగాహన పెరిగినట్లు స్పష్టమవుతోంది.
మొత్తం పన్ను చెల్లింపుదారుల్లో 39 శాతం మంది క్యాపిటల్ గెయిన్స్, 26 శాతం మంది వ్యాపార ఆదాయాన్ని ప్రకటించారు. అలాగే కేవలం జీతాన్నే ఆదాయంగా చూపిన వారి వాటా 82 శాతం నుంచి 42 శాతానికి తగ్గిపోయింది.
సీనియర్ సిటిజన్లు కూడా అదనపు ఆదాయ మార్గాలపై దృష్టి పెడుతున్నారు. 53 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు కలిగి ఉండగా, రూ.20 లక్షలకు పైగా ఆదాయం ప్రకటించిన వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.

పెట్టుబడులు, స్వయం ఉపాధి, డిజిటల్ అవకాశాలు భారతీయుల ఆర్థిక ప్రణాళికను పూర్తిగా మార్చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.