తెలంగాణలో కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి నది ప్రమాదకర స్థాయికి చేరుకుంది. శనివారం ఉదయం నీటిమట్టం 55.1 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ముప్పు తీవ్రంగా ఉండటంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
గురువారం 30 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం, కాళేశ్వరం నుంచి భారీగా విడుదలవుతున్న వరద నీటితో ఒక్కరోజులోనే 53 అడుగులకు చేరుకుంది. అనంతరం శనివారం ఉదయానికి 55.1 అడుగులకు చేరుకోవడంతో వరద ప్రభావం మరింత పెరిగింది.
జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ వరద ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షిస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నది తీర ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

పర్ణశాల వద్ద స్నాన ఘట్టాలు పూర్తిగా మునిగిపోగా, సీతవాగు ప్రవాహం కారణంగా సీతమ్మ నార చీరలు, దేవతామూర్తి పీఠం, ఇనుప వంతెన నీటిలో కలిసిపోయాయి. దుమ్ముగూడెం–భద్రాచలం రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. తురుబాక వద్ద వంతెన అప్రోచ్ రోడ్లు దెబ్బతినడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చార్ల మండలం వీరాపురం ఇసుక క్వారీలో చిక్కుకున్న 44 మందిని అధికారులు విజయవంతంగా రక్షించారు. 30కి పైగా లారీలు మాత్రం వరద నీటిలోనే చిక్కుకున్నాయి. అశ్వాపురంలో గర్భిణిని థర్మాకోల్ తెప్పపై తరలించడం, సహాయక చర్యల్లో ఇద్దరు పోలీసు అధికారులు నీటిలో పడినా క్షేమంగా బయటపడటం వంటి ఘటనలు వరద తీవ్రతను తెలియజేస్తున్నాయి.
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని, పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో గోదావరి తీర ప్రాంత ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.