హైదరాబాద్: గ్లోబరీనా సంస్థపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై సీఎం చేసిన ఆరోపణలు నిరాధారమైనవంటూ రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. 48 గంటల్లోగా బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తనపై చేసిన ఆరోపణలను నిరూపించడంలో సీఎం విఫలమైతే చట్టపరమైన చర్యలు తప్పవని కేటీఆర్ హెచ్చరించారు. క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు.
గ్లోబరీనా సంస్థ తన బినామీ సంస్థ అంటూ సీఎం చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆ సంస్థ తన బినామీదే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అదే సంస్థతో ఎందుకు ఒప్పందాలు చేసుకుందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు రాజకీయ నాటకంలో భాగమేనని విమర్శించారు.
తాను లై డిటెక్టర్ పరీక్షకు, సీఐడీ విచారణకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తన కుటుంబానికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై సిట్, సీఐడీ విచారణకు సిద్ధం కావాలని సవాల్ చేశారు.

అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సీఎం రేవంత్ రెడ్డి రాజీ రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించేందుకు సీఎం భయపడుతున్నారని విమర్శించారు. పాత కేసులు, అమృత్ పథకం, ఇతర కాంట్రాక్టుల ప్రయోజనాల కోసమే కేంద్రంతో రాజీ పడుతున్నారని ఆరోపించారు.