తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. ఆదివారం కావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తుల క్యూలైన్లు బయటకు వచ్చి శిలాతోరణం వరకు బారులు తీరాయి.
టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 20 నుంచి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
శనివారం ఒక్కరోజే 84,488 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 37,061 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.3.78 కోట్ల ఆదాయం వచ్చింది. 4.28 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.74 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించారు. వైద్య శిబిరాల్లో 3,789 మందికి చికిత్స అందించినట్లు టీటీడీ వెల్లడించింది.
