ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మరో భారీ ప్రజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు.
జులై 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు.. సూపర్-6 హామీల అమలు, మహిళలు, రైతులు, యువత, విద్యార్థులకు అందుతున్న ప్రయోజనాలను ప్రతి గడపకూ తీసుకెళ్లాలని పల్లా శ్రీనివాసరావు పార్టీ శ్రేణులకు సూచించారు.

గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలకు వివరించాలని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
అంతేకాకుండా ప్రజల సమస్యలు, సూచనలను స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.