చైనాలో ‘నౌల్’ టైఫూన్ తీవ్ర బీభత్సం సృష్టిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ తీరాన్ని తాకిన తుపాను కారణంగా దక్షిణ చైనాలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు నమోదయ్యాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 7.15 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
టైఫూన్ ప్రభావంతో హాంకాంగ్లో విమాన రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 350 విమాన సర్వీసులు రద్దు కావడంతో దాదాపు 2,000 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. గ్వాంగ్డాంగ్లో రైలు సర్వీసులను నిలిపివేశారు. పలుచోట్ల చెట్లు కూలిపోగా, స్కాఫోల్డింగ్ కూలిన ఘటనలో సుమారు 9 మంది గాయపడినట్లు సమాచారం.

‘నౌల్’ ప్రస్తుతం భూభాగంలోకి ప్రవేశించి బలహీనపడుతున్నప్పటికీ, దీని ప్రభావంతో దక్షిణ చైనాలోని పలు ప్రావిన్సుల్లో మంగళవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆకస్మిక వరదల ముప్పు నేపథ్యంలో చైనా ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది.