భారతీయుల జీవనశైలిలో వేగంగా వస్తున్న మార్పులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, శారీరక శ్రమ తగ్గిపోవడం, ఒత్తిడి వంటి కారణాలతో ఊబకాయం వేగంగా పెరుగుతోందని ఏఐజీ నిపుణులు తెలిపారు.
డాక్టర్ కపాల మాట్లాడుతూ.. ఊబకాయం కేవలం శరీర బరువు పెరగడం మాత్రమే కాదని, గుండె, కాలేయం, కిడ్నీలు, ప్యాంక్రియాస్ సహా శరీరంలోని అనేక అవయవాలను ప్రభావితం చేసే జీవక్రియ వ్యాధి అని వివరించారు.

మార్కెట్లో దొరికే ప్రాసెస్డ్ ఆహారాల్లో అధిక చక్కెరలు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండటంతో అతిగా తినే అలవాటు పెరుగుతోందన్నారు. ఫలితంగా ఫ్యాటీ లివర్, డయాబెటిస్, రక్తపోటు వంటి వ్యాధులు పెరుగుతున్నాయని చెప్పారు.
ఫ్యాటీ లివర్కు ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు ఉండవని, చాలామందికి పరీక్షలు చేసిన తర్వాతే ఈ వ్యాధి బయటపడుతుందని తెలిపారు.
పిల్లల్లో కూడా ఊబకాయం గణనీయంగా పెరుగుతోందని, తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం అలవాటు చేయాలని సూచించారు.