బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. భువనేశ్వర్, కోల్కతా, బంగ్లాదేశ్ సముద్ర తీర ప్రాంతాల సమీపంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఈ నెల 24న కోల్కతా సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రస్తుతం ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 22 నుంచి 27 వరకు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఆగస్టు 22న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పలు ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం కొనసాగి.. రాత్రి తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
గంటకు 60 కి.మీ వేగంతో గాలులు
వర్షాల సమయంలో ఈదురుగాలులు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. బంగాళాఖాతం, ఇతర సముద్ర ప్రాంతాలకు సంబంధించిన హెచ్చరికలను మత్స్యకారులు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.
మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం లోటు కూడా ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. తాజా వర్షాలతో ఈ లోటు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.