హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారంగా గాజులరామారంలో 100 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక బస్ టెర్మినల్ నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
జగద్గిరిగుట్ట సమీపంలోని హెచ్ఎంటీ భూమిని టీజీఎస్ఆర్టీసీ లీజుకు కోరినప్పటికీ, 20 ఏళ్ల లీజు, ప్రతి ఐదేళ్లకు సమీక్ష, ఏటా రూ.6 కోట్ల లైసెన్స్ ఫీజు వంటి షరతులు విధించడంతో ఆ ప్రతిపాదన అమలు కాలేదు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం గాజులరామారంలో 100 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం జగద్గిరిగుట్ట మీదుగా 75 బస్సులు రోజుకు 404 ట్రిప్పులు నిర్వహిస్తున్నాయి. కొత్త టెర్మినల్లో ఇంటర్ స్టేట్, సిటీ బస్సులకు వేర్వేరు టెర్మినళ్లు, ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.

ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే బస్సులు నగరంలోకి రాకుండానే గాజులరామారం నుంచే సేవలు అందించనున్నాయి. దీంతో ఎంజీబీఎస్, జేబీఎస్లపై భారం తగ్గి హైదరాబాద్ ట్రాఫిక్కు గణనీయమైన ఉపశమనం లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.