కేంద్ర విద్యామంత్రి రాజీనామాపై విద్యార్థుల పట్టు.. నడ్డాతో మరోసారి భేటీ

BC7News
By
1 Min Read

న్యూఢిల్లీ: నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందేనని విద్యార్థులు పట్టుబట్టారు. ఆయన రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో సీజేపీ ప్రతినిధులు అషుతోష్‌ రాంకా, సౌరవ్‌ దాస్‌.. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో పాటు నీట్‌ పేపర్‌ లీకేజీలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం, ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు నమోదు చేయకపోవడం వంటి డిమాండ్లను కేంద్రం ముందు ఉంచారు.

image

పరిహారం, విద్యార్థులపై కేసుల విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సీజేపీ ప్రతినిధి అషుతోష్‌ రాంకా తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాపై మాత్రం శనివారం మధ్యాహ్నం వరకు సమయం కోరినట్లు చెప్పారు. కేంద్రం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని, శనివారం మరోసారి కేంద్ర మంత్రులతో సమావేశమవుతామని వెల్లడించారు.

అయితే ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాజీనామా చేయడం సులభమైన పరిష్కారమని, బాధ్యతల నుంచి తప్పించుకోవడం సరికాదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీలో అవసరమైన సంస్కరణలు చేపట్టడమే తమ లక్ష్యమని, పేపర్‌ లీకేజీకి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

📄 Generate e-Paper Clip
Share This Article