న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం బీజేపీ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ, ఎన్డీయే ఎంపీలు ఘన స్వాగతం పలుకుతూ ‘ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో సభా ప్రాంగణాన్ని మార్మోగించారు.
మకార్ ద్వార్ వద్ద ప్రధాన్కు సంప్రదాయ టోపీని అందజేసి గౌరవించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ తమ నాయకత్వానికి అండగా నిలుస్తున్నామనే సంకేతాన్ని అధికార కూటమి ఇచ్చింది.

ఇక కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నేతృత్వంలో విపక్ష సభ్యులు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. నీట్ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు అనుసరించిన వైఖరిని తప్పుబడుతూ ‘శిక్షా చోరీ’ ప్లకార్డులతో ఆందోళన వ్యక్తం చేశారు. హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, అఖిలేష్ యాదవ్ తదితర నేతలు ఈ నిరసనలో పాల్గొన్నారు. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
