పబ్లిక్ పరీక్షల్లో పేపర్ లీక్ ఘటనలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పేపర్ లీకులను అరికట్టే సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ Narendra Modi స్వాగతించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పేపర్ లీక్ సమస్యను ఎదుర్కొంటున్నాయని మోదీ పేర్కొన్నారు. ఈ ఘటనల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఉంచే నమ్మకాన్ని దెబ్బతీసే చర్యలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని స్పష్టం చేశారు.

పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మార్చేందుకు సాంకేతికత వినియోగాన్ని విస్తృతంగా పెంచుతున్నామని ప్రధాని తెలిపారు. డిజిటల్ పర్యవేక్షణ, వేగవంతమైన పరీక్షా వ్యవస్థలు, కఠిన భద్రతా చర్యలతో పరీక్షల నిర్వహణను మరింత బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు.
కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పేపర్ లీక్ ముఠాలపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. నిజాయితీగా చదివే విద్యార్థుల భవిష్యత్తును రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.