న్యూఢిల్లీ: గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు సోమవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. గోవా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీతో ఆయన భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని అశోక్ గజపతి రాజు సాదరంగా ఆహ్వానించారు. ఆలయ ట్రస్ట్ తరఫున ఈ ఆహ్వానం అందించినట్లు తెలిపారు. సింహాద్రి అప్పన్న స్వామివారి ప్రతిమను ప్రధానమంత్రికి బహూకరించారు.
తన ఆహ్వానంపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని అశోక్ గజపతి రాజు వెల్లడించారు. త్వరలోనే సింహాచలం స్వామివారిని దర్శించుకుంటానని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
భేటీలో గోవాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పలు ప్రాజెక్టుల పురోగతిపై కూడా అశోక్ గజపతి రాజు ప్రధాని మోదీకి వివరించారు.