హైదరాబాద్: హిందూ పండుగల తేదీల విషయంలో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న గందరగోళానికి పరిష్కారం చూపే దిశగా తెలంగాణ జ్యోతిష్య విజ్ఞాన సభ కీలక నిర్ణయం తీసుకుంది. 2027-28, 2028-29 సంవత్సరాలకు సంబంధించిన పండుగలు, పర్వదినాల తేదీలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన దృక్ సిద్ధాంత పంచాంగ కర్తలు విస్తృతంగా చర్చించి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
తెలంగాణ అర్చక సమాఖ్య, భాగ్యనగర అర్చక పురోహిత సంఘం, భారతీయ తెలుగు దృగ్గణిత పంచాంగ కర్తల సమాఖ్య సేవా సంఘం, శ్రీ చండీ పరమేశ్వరి పీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 6న హైదరాబాద్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్లో తెలంగాణ జ్యోతిష్య విజ్ఞాన సభ నిర్వహించారు.
డాక్టర్ అవసరాల ప్రసాద్ శర్మ సిద్ధాంతి అధ్యక్షతన, శ్రీ గట్టు శ్రీనివాసాచార్యుల సమన్వయంతో జరిగిన ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సిద్ధాంతులు, పంచాంగ కర్తలు, జ్యోతిష్య పండితులు హాజరయ్యారు.
సభలో **ప్లవంగ నామ సంవత్సరం (2027-28), కీలక నామ సంవత్సరం (2028-29)**కు సంబంధించిన పండుగల నిర్ణయాలను శాస్త్రబద్ధంగా పరిశీలించారు. తిథులు, పర్వకాలాలు, పండుగల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించిన అనంతరం రెండు సంవత్సరాలకు సంబంధించిన పండుగల తేదీలను ఏకగ్రీవంగా తీర్మానించారు.
గత కొన్నేళ్లుగా ఒకే హిందూ పండుగకు రెండు వేర్వేరు తేదీలు వెలువడటంతో ప్రజలు, భక్తులు, ఆలయాలు, అర్చకులు, ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు తీవ్ర అయోమయానికి గురవుతున్నాయని సభలో ప్రస్తావించారు. ఒకే పండుగను రెండు రోజుల్లో నిర్వహించాల్సిన పరిస్థితి రావడం వల్ల పరిపాలనా సమస్యలు కూడా తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

భారత ప్రభుత్వం 1953లో ఏర్పాటు చేసిన క్యాలెండర్ రిఫార్మ్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రత్యక్ష గ్రహగతుల ఆధారంగా రాష్ట్రీయ పంచాంగం (National Panchang) ప్రతి సంవత్సరం ప్రచురితమవుతోందని సభలో వివరించారు. ఇది ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులో ఉండటంతో పాటు రాష్ట్రాల దేవాదాయ, ధర్మాదాయ శాఖలకు అధికారికంగా పంపిణీ అవుతోందని తెలిపారు.
దృక్ సిద్ధాంత పంచాంగాల్లోని పండుగల నిర్ణయాలు కూడా రాష్ట్రీయ పంచాంగంలోని నిర్ణయాలతో ఏకీభవిస్తున్నాయని పంచాంగ కర్తలు పేర్కొన్నారు.
సభలో చర్చించిన అంశాలన్నింటినీ పొందుపరుస్తూ రూపొందించిన తీర్మానాన్ని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ పొన్నాడ సుబ్రహ్మణ్యం గారికి, మాజీ మంత్రి శ్రీ వేణుగోపాలచారి గారికి సభలోనే అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ గంగు ఉపేంద్ర శర్మ, పరాశర రవీంద్రాచార్యులు, డీవీఆర్ శర్మ, పెన్నా మోహన్ శర్మ, సతీష్ శర్మ, సంతోష్ శాస్త్రి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే శ్రీ గొర్తి పట్టాభి సిద్ధాంతి, పీఎస్ఆర్ కృష్ణ, నిట్టల కృష్ణ ప్రసాద్, సీవీ అనంత, కర్ర వీరభద్రం, బిజుమల్ల శ్రీనివాస్ సిద్ధాంతి తదితర తెలుగు రాష్ట్రాల సిద్ధాంతులు, పంచాంగ కర్తలు సభలో పాల్గొన్నారు.