పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో జరిగిన సీఐఐ నార్తర్న్ రీజనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మంచి పాలనకు రాజకీయాలు అడ్డుకావని అన్నారు. ప్రభుత్వాలు మారినా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడం తమ విధానమని చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ అభివృద్ధికి బాటలు వేసాయని కొనియాడారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి ప్రపంచ ప్రముఖులను హైదరాబాద్కు తీసుకువచ్చి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించిన విషయాన్ని గుర్తు చేశారు.
అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మితమయ్యాయని, వాటి వల్ల హైదరాబాద్ ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రధాన కేంద్రంగా ఎదిగిందని సీఎం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అదే అభివృద్ధి వేగాన్ని మరింత పెంచే దిశగా చర్యలు
తీసుకుంటోందన్నారు.
తమ పోటీ దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదని, ప్రపంచంలోని ప్రముఖ తయారీ దేశాలతోనని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ను టోక్యో, న్యూయార్క్ వంటి గ్లోబల్ నగరాల సరసన నిలబెట్టడమే లక్ష్యమన్నారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధి, మూడు బుల్లెట్ రైలు మార్గాల ప్రతిపాదనలు తెలంగాణ భవిష్యత్తుకు కీలకమని పేర్కొన్నారు.
పెట్టుబడుల పరంగా రాష్ట్రం రికార్డు స్థాయిలో ముందుకు వెళ్తోందని సీఎం వెల్లడించారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల కోసం దాదాపు 200 కంపెనీలు తెలంగాణను ఎంపిక చేస్తున్నాయని తెలిపారు. అమెజాన్ రూ.1 లక్ష కోట్లు, అదానీ గ్రూప్ రూ.35 వేల కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నాయని వివరించారు. భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీలో ప్రపంచ ప్రఖ్యాత 500 కంపెనీలను తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి వెల్లడించారు.