కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారన్న వార్తలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) స్పందించింది. నీట్ పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో మంత్రి రాజీనామాను తమ ఉద్యమం సాధించిన విజయంగా పేర్కొంటూ శనివారం జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారులు సంబరాలు నిర్వహించారు.
తమ ప్రధాన డిమాండ్లలో ఒకటి నెరవేరిందని సీజేపీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో వెల్లడించింది. మహాత్మా గాంధీ స్ఫూర్తితో చేపట్టిన శాంతియుత పోరాటం ద్వారా లక్ష్యాలను సాధించవచ్చని తమ ఉద్యమం నిరూపించిందని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. ఈ విజయం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ చెందుతుందని పేర్కొన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్త తెలియగానే జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల శాంతియుత పోరాటం వృథా కాలేదని, ప్రజాస్వామ్యంలో తమ గళాన్ని వినిపించడంలో యువత విజయం సాధించిందని సీజేపీ నేతలు అన్నారు. ఈ సందర్భంగా సాయంత్రం 6:30 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
తమకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని సీజేపీ స్పష్టం చేసింది. మూడు ప్రధాన డిమాండ్లలో ఒకటి నెరవేరిందని, మిగిలిన రెండు డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపింది. నిరసన చేస్తున్న విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దేశ విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే వరకు తమ పోరాటం ఆగదని సీజేపీ స్పష్టం చేసింది.